తరలిపోతున్న అగ్రి గోల్డ్ ఆస్తులు.. రూ.లక్షలు గడిస్తున్న అక్రమార్కులు!

సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ ఆస్తులను అక్రమార్కులు తరలించుకుపోయి లక్షలు గడిస్తున్నారు.

Update: 2024-09-07 02:03 GMT

దిశ, కనిగిరి: సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ ఆస్తులను అక్రమార్కులు తరలించుకుపోయి లక్షలు గడిస్తున్నారు. నియోజకవర్గం పామూరు మండలంలోని గుమ్మలం పాడు, పడమరకట్ట కిందపల్లె, కంబాలదిన్నె తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో అగ్రి గోల్డ్ వారి జామాయిల్ తోటలు(Eucalyptus) ఏపుగా పెరిగాయి. ఆ తోటల్లో జామాయిల్ కర్రను నరికి, అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ జామాయిల్ కర్రను(Eucalyptus) అక్రమార్కులు తెగ నరికి లారీల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

పెట్టుబడి లేకుండా ఆదాయం..

పైసా పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం వస్తుండడంతో అడ్డొచ్చిన అధికారులను ప్రసన్నం చేసుకుంటూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవలే అక్రమంగా జామాయిల్ కర్రతో తరలి వెళుతున్న వాహనాన్ని పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భీమా నాయక్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. అగ్రి గోల్డ్ ఆస్తులను కాపాడి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రి గోల్డ్ బాధితులు కోరుతున్నారు.


Similar News