Harsha Kumar : జగన్ ని చూసి నేర్చుకో : చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి(Financial Problems)ని ఏకరవు పెడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsha Kumar) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి(Financial Problems)ని ఏకరవు పెడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsha Kumar) మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. 2014లో జగన్ రైతు రుణమాఫీ చేయలేనని చెప్పగా..నీవు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని..అప్పుడు కేంద్రంతో పొత్తు అని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకోవడం..రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, పోలవరం అంశాలలో విఫలమై 2019వరకు రాష్ట్రానికి విఫల సీఎంగా మిగిలారన్నారు.
పదేళ్ల ఉమ్మడి రాజధానిని ఓటుకు నోటు కేసుతో వదిలేసి..అమరావతి రాజధానిని గ్రాఫిక్స్ లో చూపి మోసం చేయగా.. 2019ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు ఓడించి జగన్ ను సీఎంగా చేశారన్నారు. మీరు పసుపు కుంకుమను పెంచేసి ఖాళీ ఖజనా జగన్ కు కట్టబెట్టి పోయినప్పటికి..జగన్ తను చెప్పిన సంక్షేమ పథకాలను ఐదేళ్ల పాటు నిరాటంకంగా సమర్థవంతంగా అమలు చేశారన్నారు. అంటే మీరు గొప్ప పాలకుడా లేక జగన్ గొప్ప పాలకుడా అని చెప్పాలంటే జగన్ సమర్థవంతమైన పాలకుడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు కంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో..అడ్డగోలు హామీలు ఇవ్వకుండా ఉండటంలో జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సిందేనన్నారు.
మీరు మళ్లీ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటిదాకా అమలు చేయలేదని.. మీరు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రి అనడానికి ఇది చాలని చంద్రబాబుపై హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను జగన్ అమలు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోతున్నాడో ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తుందని చెప్పారని..అది తెలిసి కూడా మీరు ఎన్నికల్లో గెలిచేందుకు మోసపూరిత హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చి మీరు చెప్పిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా మాట్లాడుతున్నందుకు చంద్రబాబుపై కేసు పెట్టాలని, ఆ దిశగా మేం చర్యలు తీసుకుంటామని హర్షకుమార్ ప్రకటించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందంటునే రాజధాని, పోలవరం వంటి పనులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఎందుకో ప్రజలు ఆలోచించాలని..అందుకోసం కొత్తగా చేసే అప్పులు ఎలా తీరుస్తారో చంద్రబాబు ఆలోచించాలని..అందుకే మోసపూరితమైన వైఖరుల నుంచి చంద్రబాబు మారాలని కోరుతున్నామన్నారు.