జమ్మలమడుగు వైసీపీలో చెలరేగిన అసంతృప్తి.. కీలక సమావేశానికి కౌన్సిలర్లు డుమ్మా

కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో అసంతృప్తి చెలరేగింది...

Update: 2024-08-28 12:12 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో అసంతృప్తి చెలరేగింది. కౌన్సిల్ సమావేశానికి 16 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. చైర్ పర్సన్ శివమ్మ, మరో కౌన్సిలర్ మాత్రమే ఆ సమావేశానికి హాజరయ్యారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లు సమావేశానికి వెళ్లలేదని తెలుస్తోంది.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జమ్మలమడుగు మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ నాయకులు జయ కేతనం ఎగురవేసింది. మొత్తం 18 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఘన విజయం సాధించారు. దీంతో జమ్మలమడుగు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టిన కూటమి నాయకులు వాటిని కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేషన్లను కూటమి చేజిక్కించుకుంది. తాజాగా జమ్మలమడుగు కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జమ్మలమడుగు వైసీపీ నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. పార్టీ అధిష్టానం కొందరికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నచ్చడం లేదు. దీంతో పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వైసీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా చేశారనే ప్రచారం జరగుతోంది. 

Tags:    

Similar News