ఎవరూ జోక్యం చేసుకోకండి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు హెచ్చరిక

లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు.

Update: 2024-10-18 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారు. త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. 2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.


Similar News