Ap News: మరోసారి జగన్ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనమే..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు....

Update: 2024-01-21 12:42 GMT

దిశ, అనంతపురం ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారికే స్పష్టంగా తెలుసన్నారు. పన్నులు, ఛార్జీల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చిన ప్రభుత్వమిది అని మండిపడ్డారు. పండుగలు వస్తే గత టీడీపీ హయాంలో పేదలకు కానుకలను అందించే వారమని.. కానీ ఇప్పుడు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఏమయ్యాయని పరిటాల సునీత ప్రశ్నించారు.


మద్యపాన నిషేధం చేస్తామని ఊదరగొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను మరింత విస్తృతం చేయడమే కాకుండా నాసిరకం మద్యంతో మందుబాబుల ప్రాణాలు తీస్తున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. కానీ ఈ ఐదేళ్లలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచారన్నారు. చివరకు చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచారన్నారు. నాలుగేళ్ల పాటు బాగా వర్షాలు కురిసినా.. వ్యవసాయానికి నీరు అందించలేని అసమర్థపాలన ఇది అని వ్యాఖ్యానించారు. నేటికీ ఉపాధి కోసం బయట ఊళ్లకు వెళ్లి బతకాల్సి వస్తోందన్నారు. వైసీపీ పాలనలో ఇలా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం భూకబ్జాలు, దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో నమ్మిన వారినే మోసం చేస్తూ జగన్ చివరకు చెల్లికి కూడా అన్యాయం చేశారన్నారు. విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులన్నారు. నీతి, నిజాయితీతో రాజకీయాలు చేసే వ్యక్తులు కావాలని.. అది చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. 

Tags:    

Similar News