జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ మహిళకు శస్త్రచికిత్స

మెదడులో కణితితో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు తన అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించడం వైరల్ గా మారింది.

Update: 2024-09-18 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : మెదడులో కణితితో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు తన అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించడం వైరల్ గా మారింది. కాకినాడ సర్వజన ఆసుపత్రిలో ఓ మహిళ మెదడులో ఉన్న కణితిని " అవేక్ క్రానియోటమీ " విధానంలో వైద్యులు తొలగించారు. అయితే సర్జరీ సమయంలో నరాలు దెబ్బతినకుండా ఆమెకు ఇష్టమైన ఎన్టీఆర్ నటించిన " అదుర్స్ " సినిమా చూపిస్తూ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ డిపార్ట్​మెంట్​ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)ని ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా కాకినాడలోని జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా కణితిని తొలగించారు. ‘అదుర్స్‌’ మూవీ చూపిస్తూ ఆమె ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుమ నడిచే హాస్య సన్నివేశాలను చూస్తూ ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు. సినిమాలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులో ఏర్పడిన కణితి తొలగింపు శస్త్రచికిత్సను వైద్యబృందం పూర్తిచేసింది. మెలకువలో ఉండగానే (అవేక్‌ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ సర్జరీని పూర్తి చేయడం ద్వారా వైద్యులు ప్రశంసలందుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె లేచి కుర్చున్నారని, టిఫిన్ కూడా​ తీసుకున్నారన్నారని వైద్యబృందం తెలిపింది. జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని, మరో అయిదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్‌ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్​మెంట్​ సాగిందని వివరించారు.


Similar News