గుజరాత్‌కు వరుణుడి దెబ్బ

ఐపీఎల్-17లో గుజరాత్ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.

Update: 2024-05-13 18:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో గుజరాత్ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. వరుణుడి దెబ్బకు ఆ జట్టు నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఆడాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న గుజరాత్‌కు వరుణుడు షాకిచ్చాడు. వర్షం కారణంగా టాస్ కూడా పడుకుండానే మ్యాచ్ రద్దైంది. మొదట ప్రతికూల వాతావరణం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. కానీ, కాసేపటికే ఉరుములు, మెరుపులతో వరుణుడు వచ్చేశాడు. వర్షం ఎంతకీ తగ్గలేదు. కనీసం ఐదు ఓవర్ల ఆట నిర్వహించాలని భావించినా అది కూడా సాధ్యపడలేదు. రాత్రి 10 గంటల తర్వాత వర్షం తగ్గింది. కానీ, వర్షం నీటితో స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రాత్రి 10:30 తర్వాత మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

ముంబై, పంజాబ్ తర్వాత

ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ 10 పాయింట్లతో ఉంది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉండేది. అయితే, కేకేఆర్‌తో మ్యాచ్ రద్దవడంతో గుజరాత్ ప్రస్తుతం 11 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నది. ఇక నామమాత్రపు చివరి మ్యాచ్‌లో నెగ్గినా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లే చేరతాయి. ఇప్పటికే చెన్నయ్, హైదరాబాద్ 14 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉండటంతో గుజరాత్‌కు ముందడుగు వేసే అవకాశం లేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తర్వాత ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో జట్టు గుజరాత్. గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన గుజరాత్ ఈ సారి ప్లే ఆఫ్స్‌ కూడా అర్హత సాధించలేకపోవడం గమనార్హం. ఈ నెల 16న హైదరాబాద్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు, ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న కోల్‌కతా 19 పాయింట్లతో టాప్-2లో చోటు ఖాయం చేసుకుంది. దీంతో క్వాలిఫయర్ 1కు అర్హత సాధించింది.

Tags:    

Similar News