విషాదం.. యువ యూట్యూబర్ ఆత్మహత్య

శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం సాయిరాం (21) అనే యూట్యూబర్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-07-01 04:53 GMT

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం సాయిరాం (21) అనే యూట్యూబర్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గుర్రం భాగ్యలక్ష్మి, నాగరాజు దంపతులకు ఇద్దరు కుమారులు. భాగ్యలక్ష్మి హుజురాబాద్‌లోని కోర్టులో సబార్డినేట్‌గా విధులను నిర్వర్తిస్తుండగా పిల్లలు పెద్దబ్బాయి అభిరామ్ ఇటీవల బీటెక్ పూర్తి చేసుకున్నాడు. చిన్నవాడు సాయిరాం సింగపూర్ గ్రామంలో గల ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఖాళీగా ఉన్న సమయంలో లఘు చిత్రాలకు మాటలు రాసేవాడు. అంతేకాకుండా పాటలకు ట్యూన్స్ కట్టడం, పాటలు పాడడం చేసేవాడు. తను పాడిన ‘యాది కొస్త లేడా ఈ పేదోడు నీకు ఓసారి అయినా’ అనే పాట విశేష ప్రజాధరణ పొందింది.

అంతే కాకుండా మన చిన్న చిత్రాలు అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనలో ఉన్న కళను బయటపెట్టాడు. జీవనోపాధి కోసం కరీంనగర్‌లో ని ఓ బ్రాండీ షాపులో పనిచేస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చి ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్‌లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం లేచి తల్లితండ్రులు చూసేసరికి ఇంటికి ఎదురుగా సాయిరాం విగత జీవిగా కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిన్న వయసులోనే అనంత లోకాలకు చేరుకున్న యువకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. దీనితో కరీంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి కేశవపట్నం పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News