మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం

సోలార్ ప్లాంట్‌లో కేబుల్ దొంగతనానికి వెళ్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-11 01:56 GMT

దిశ, మిడ్జిల్: సోలార్ ప్లాంట్‌లో కేబుల్ దొంగతనానికి వెళ్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోయిన్‌పల్లి గ్రామంలోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో సోలార్ యజమాన్యం రెండు కంచెలు ఏర్పాటు చేశారు. అందులో రెండో కంచెకు విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అయితే దొంగతనానికి వచ్చిన వ్యక్తులు మొదటి కంచె కట్ చేసుకుని లోపలికి వెళ్లి రెండో కంచె కట్ చేసే క్రమంలో కరెంటు సరఫరా అవ్వడంతో కింద తడిగా ఉండడం వల్ల విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. కాగా వారితో పాటు మరో ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్కడ ఓ మహిళ కాలు గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించామని ఎస్సై తెలిపారు. 


Similar News