అతి తెలివి వారి కొంప ముంచింది....
అతి తెలివి వారి కొంప ముంచింది. చాటుమాటుగా చేసుకునే వ్యాపారాన్ని ఫేస్బుక్లో ప్రచారం చేయడంతో అసలుకే మోసం వచ్చింది.
దిశ, జూబ్లిహిల్స్ : అతి తెలివి వారి కొంప ముంచింది. చాటుమాటుగా చేసుకునే వ్యాపారాన్ని ఫేస్బుక్లో ప్రచారం చేయడంతో అసలుకే మోసం వచ్చింది. వివరాల్లోకి వెళితే...జూబ్లిహిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా విస్కీ 100 పైపెర్స్ తో ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విస్కీని ఉపయోగించి ఐస్క్రీమ్లు తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు నేతృత్వంలో జూబ్లిహిల్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ రావు తదితర ఎక్సైజ్ సిబ్బంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5 లోని అరికో ఐస్క్రీమ్ పార్లర్లలో గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో విస్కీ కలిపిన ఐస్క్రీమ్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్లు తేలింది. టేస్ట్ బాగుండటంతో ఐస్క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసి నిర్వాహకులు యువతీ, యువకులను ఆకర్షించే విధంగా ఫేస్ బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చారు. దీంతో ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందటంతో సోదాలు నిర్వహించగా 11.5 కేజీల విస్కీ ఐస్క్రీమ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు దయాకర్ రెడ్డి , శోభన్బాబు, శరత్ చంద్ర పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దయాకర్ రెడ్డి , శోభన్బాబు లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.