కరోనా కాలంలోనూ ఆదాయం పెంచుకున్న టెక్ దిగ్గజాలు

by  |
కరోనా కాలంలోనూ ఆదాయం పెంచుకున్న టెక్ దిగ్గజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 సంక్షోభం ఉన్నప్పటికీ టెక్ దిగ్గజ కంపెనీలు యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ సహా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లు భారీగా లాభాలను దక్కించుకున్నాయి. కరోనా వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం కొన్ని రంగాలే పుంజుకున్నాయి. వీటిలో మెడికల్, హెల్త్, ఈ-కామర్స్, ఇంటర్నెట్ విభాగాలు భారీగా పుంజుకున్నాయి. కరోనా వల్ల సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ యాడ్ సేల్స్ మార్చిలో పడిపోయాయి. ఆ తర్వాత జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రికవరీ అయ్యాయి.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ అంతకుముందుతో పోలిస్తే రెండో త్రైమాసికంలో 2 శాతం ఆదాయం తగ్గింది. మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఆదాయం ఉండటంతో కంపెనీ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సమీక్షించిన త్రైమాసికంలో యూట్యూబ్ యాడ్ సేల్స్ 6 శాతం పెరిగాయి. మొత్తంగా త్రైమాసిక ఆదాయం 38.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, 2009 సంక్షోభం తర్వాత వృద్ధి రేటు నెమ్మదించడం ఇది తొలిసారి.

ఇక, మరో టెక్ డిగ్గజం ఫేస్‌బుక్ ఆదాయం రెండో త్రైమాసికంలో అంచనాలను మించి 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఈ వృద్ధి గతంలో కంటే చాలా తక్కువ. కానీ, నిపుణుల అంచనాలను మించి వృద్ధిని నమోదు చేసింది. ఫేస్‌బుక్ యాడ్ సేల్స్ 10 శాతం వృద్ధితో 18.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం కూడా ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ బిజినెస్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో అమెజాన్ ఆదాయం ఏకంగా 40 శాతం పెరిగి 88.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం రెండింతలు పెరిగింది. ఇక, స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ అన్ని విభాగాల్లోనూ వృద్ధి సాధించింది. కరోనా వ్యాప్తితో పాటు, లాక్‌డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోం, లెర్నింగ్ ఫ్రమ్ హోం లాంటి పలు కారణాలతో కంపెనీ వృద్ధి సాధించింది. యాపిల్ రెండో త్రైమాసికం ఆదాయం 59.69 బిలియన్ డాలర్లుగా ఉంది.



Next Story