డ్రాగన్ కంట్రీ పై అమెరికా కన్నెర్ర.. కారణం అదేనా?

by  |
డ్రాగన్ కంట్రీ పై అమెరికా కన్నెర్ర.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా సంక్షోభం రాకముందే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. కరోనా ఎంటరయ్యాక అది మరింత ముదిరింది. అప్పటినుంచి చైనాకు చెందిన అనేక సంస్థలపై నిషేధం గానీ, ఆంక్షలు గానీ విధిస్తూ అగ్రరాజ్యం కటువుగా వ్యవహరిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 11భారీ కంపెనీలే లక్ష్యంగా ఆంక్షలు విధించింది. అందుకు కారణం, చైనాలోని వీగర్ ముస్లింలపై అక్కడి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడమే! షిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్ ముస్లింలపై ప్రభుత్వ అణచివేతలో ఈ కంపెనీలకు కూడా పాత్ర ఉందని అమెరికా భావిస్తోంది.

చైనాలో మైనార్టీ వర్గం అయిన వీగర్ ముస్లింలతో బలవంతంగా ఆయా కంపెనీల్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అమెరికా వాణిజ్య విభాగం చెబుతోంది. అంతేకాదు, వీటిలో రెండు కంపెనీలు వీగర్ ముస్లింలపై జన్యుపరమైన అధ్యయనాలు కూడా చేపడుతున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించింది.

ఇకపై ప్రభుత్వ అనుమతి లేనిదే ఈ చైనా కంపెనీలతో అమెరికా కంపెనీలు ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీలుపడదు. తాజా ఆంక్షలు విధించిన కంపెనీల జాబితాలో నన్ చాంగ్ ఓ-ఫిల్మ్ టెక్, బీజింగ్ జీనోమ్ ఇన్ స్టిట్యూట్ వంటి సంస్థలు ఉన్నాయి. నన్ చాంగ్ సంస్థ అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు సరఫరాదారు కాగా, బీజింగ్ జీనోమ్ ఇన్ స్టిట్యూట్ కు చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.


Next Story