బీసీసీఐకి ఆకాశవాణి లేఖ

by  |
బీసీసీఐకి ఆకాశవాణి లేఖ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌ మ్యాచ్‌లకు సంబంధించిన కామెంట్రీని రేడియోలో ప్రసారం చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) బీసీసీఐని కోరింది. ఈ మేరకు ప్రసారభారతి సీఈవో శశి వెంపటి బోర్డుకు లేఖ రాసినట్టు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ‘రేడియో కామెంట్రీ అనుమతి కోరుతూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశాం. ఇప్పటికే టీమ్ ఇండియా మ్యాచ్‌లకు కామెంట్రీ హక్కులు కలిగి ఉన్నాం.

ప్రస్తుతం కోవిడ్-19 నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. టీవీలు లేని క్రికెట్ ప్రేమికులకు రేడియో మంచి ప్రత్యామ్నయం. కాబట్టి తాను ఈ ప్రతిపాదన చేశాం’ అని శశి తెలిపారు. గత ఏడాది టీమ్ ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌ల లైవ్ కామెంట్రీ అందించడానికి బీసీసీఐ, ప్రసారభారతి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ యూఏఈలో ఉన్నారు. ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి వారం రోజుల సమయమే ఉండటంతో ఈ సీజన్‌లో ఈ ఒప్పందం అమలులోకి వస్తుందనేది అనుమానంగా మారింది.



Next Story