ఈ సారు రూటు సప'రేటు'

by  |
ఈ సారు రూటు సపరేటు
X

దిశ, వరంగల్: జిల్లాలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ అధికారి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కొత్త రూటు పేరుతో అమాయకుల నుంచి సప’రేటు’గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకుని.. ఇదేందీ సారూ అని అడిగితే.. వాస్తవేమననీ, కాని ఆగండంటూ సంవత్సరం నుంచి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దీంతో ఆ బాధితులు ఆందోళన బాట పట్టారు.
వివరాల్లెకెళితే.. రైతుల అమాయకత్వాన్ని కొందరు అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. అసలే నష్టాల ఊబిలో ఉన్న వారిని మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. జనగామ జిల్లాలో ఓ వ్యవసాయ విస్తరణ అధికారి పంట నష్ట పరిహారం అందజేసే క్రమంలో రైతులను మచ్చిక చేసుకున్నాడు. పంటలకు బీమా ఉంటేనే నష్ట పరిహారం వస్తుందంటూ ఇన్సూరెన్స్ చేయించే సాకుతో బాధిత రైతుల నుంచి లక్షల రూపాయాలు వసూలు చేశాడు. కానీ, ఎన్నిరోజులు గడిచినా పంట నష్టపరిహారం అందకపోయేసరికి రైతులు అధికారిని గట్టిగా నిలదీశారు. దీంతో అసలు మోసం బయటపడింది. తాము ఇచ్చిన డబ్బుల సంగతేంటంటూ అడిగిసరికీ.. తిరిగి ఇస్తానంటూ ఏడాది కాలంగా బుకాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రెండ్రోజులుగా జిల్లాలో వడగండ్ల వర్షం కురువడంతో స్వల్పంగా పంటలు దెబ్బతిన్న రైతులు గతంలో జరిగిన మోసాన్ని తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్సూరెన్స్ పేరిట దందా..

జనగామ జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్న మల్లేశం ఇన్సూరెన్స్ పేరిట కొత్త దందాకు తెరతీశాడు. రెండేళ్ల కిందట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జనగామ మండలం శామీర్ పేట, పసరమడ్ల క్లస్టర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే క్రమంలో దురాలోచనకు రూపకల్పన చేశాడు. పంటలకు బీమా ఉంటేనే నష్ట పరిహారం వస్తుందని మొదట పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించాడు. ఆ పని తనకు అప్పగిస్తే ఉన్నతాధికారులను మేనేజ్ చేసి బీమా సొమ్ము త్వరగా వచ్చేలా చూస్తానని రైతులను నమ్మించాడు. దీంతో అధికారి మాటలను నమ్మిన రైతులు ఎకరాకు రూ. 4 వేల చొప్పున రూ. 2 లక్షల వరకు ముట్టజెప్పారు. కానీ, నెలలు గడుస్తున్న పరిహారం డబ్బులు రాకపోకపోవడంతే బాధితులంతా కలిసి మూకుమ్మడిగా అధికారిని కలిసి నిలదీశారు. దీంతో వారిని బుకాయించాలని చూసినా అధికారి చివరికి తన తప్పును అంగీకరించాల్సి వచ్చింది. రైతులు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి.. ఇప్పటి ఏడాది గడుస్తున్నా వాయిదాలు వేస్తూ ఉన్నారు. అయితే, డబ్బులు తిరిగి ఇస్తానని చెబుతున్నాడే తప్ప ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకుంటాం :బాధిత రైతులు

పంటలకు బీమా చేయిస్తానని నమ్మించిన వ్యవసాయ విస్తరణ అధికారి లక్షల రూపాయాలు కాజేసి తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లి గట్టిగా నిలదీసిన కొంతమంది రైతులకు డబ్బులు తిరిగి ఇచ్చాడనీ, మిగతా వాళ్ల విషయంలో దాటవేత ధోరణి అవలంభిస్తున్నట్లు చెబుతున్నారు. బాధితులు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారి సత్వరమే స్పందించి తమ డబ్బులు ఇవ్వాలనీ, లేకపోతే కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని బాధితులు పేర్కొంటున్నారు.

Tags: warangal, Agriculture Officer, Collector, Farmers, Bribery, Punta Insurance,



Next Story