‘ఖాన్ చెరువు నీళ్లతో రాములవారి పాదాలు కడుగుతా’

by  |
‘ఖాన్ చెరువు నీళ్లతో రాములవారి పాదాలు కడుగుతా’
X

దిశ, మహబూబ్‌నగర్: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 1500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.79లక్షలను ఖర్చు చేసి ఖాన్ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సొమవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పెద్దగూడెంలో వైకుంఠధామం ప్రారంభించి, ఖాన్ చెరువుకు నీళ్లు నింపే లిఫ్ట్ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఖాన్ చెరువు నింపి రాములవారి పాదాలు కడుగుతానని, విపక్ష నేతలు ఫిర్యాదులతో నీళ్లు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అనుమతుల కోసం ఎదురుచూస్తే రైతులు నష్టపోతున్నారని గ్రహించి పయోనీర్ విత్తన సంస్థను సామాజిక బాధ్యతగా రైతులకు మేలు చేసే ఈ లిఫ్ట్ చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. అలాగే వారు ముందుకు వచ్చి లిఫ్ట్ నిర్మిస్తున్నారని, లిఫ్ట్ నిర్వహణకు గ్రామంలో ఒక కమిటీని ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో దాదాపు 40 ఈ తరహా చిన్న పెద్ద లిఫ్టులు చేపట్టడం జరిగిందని, సాగుకు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని, అందుకే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతులను ప్రోత్సహించే ఇన్ని పథకాలు లేవని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీటి రాకతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు.


Next Story

Most Viewed