సూర్యాపేట, నల్లగొండ వైద్య కళాశాలలకు అదనపు సిబ్బంది

by  |
సూర్యాపేట, నల్లగొండ వైద్య కళాశాలలకు అదనపు సిబ్బంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొత్తగా నెలకొల్పిన మెడికల్ కళాశాలల్లో అదనపు సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ కళాశాలల్లోని పరిస్థితులపై లోతుగా సమీక్షించారు. మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న వైద్య విద్యార్థులకు కావలసిన వసతులు, అదనపు సౌకర్యాలు, కళాశాలల బ్లాకుల నిర్మాణం తదితరాలపై చర్చించారు. రెండు కళాశాలల్లో రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్నందున సిబ్బంది కొరత ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. పాలనాపరమైన అనుమతులు తీసుకుని త్వరితగతిన నియామకాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. ఈ రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో మార్చురీలను ఆధునికీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిలతో పాటు నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed