కొవిడ్ నియంత్రణపై గవర్నర్ సమీక్ష

by  |
Governor Tamilisai
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం పలువురు మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గవర్నర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. లాక్‌డౌన్ ఉత్తమ మార్గమైనప్పటికీ దీర్ఘకాలం అమలు చేసే పరిస్థితి లేదని వారు అభిప్రాయ పడ్డారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన వారికి పరీక్షలు నిర్వహించాలని, ఈ చర్య వల్ల ఇతర కుటుంబ సభ్యులను రక్షించేందుకు అవకాశం కలుగుతుందని సూచించారు. ముందు వరుసలో ఉండి పోరాడుతున్న కరోనా వారియర్స్‌కు తరచుగా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. ‘వైద్యో రక్షతి రక్షిత:’ నినాదంలో వైద్యులను, సిబ్బందిని కాపాడుకోవాలని, వారే ప్రజలను రక్షిస్తారన్నారు. కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించడంలో భాగంగా ఆన్‌లైన్ పద్ధతిలో వైద్యులకు ఎప్పటికప్పుడు విధివిధానాలు, మార్పులపై అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ పీజీ, ఇతర పరీక్షలను వాయిదా వేయాలని గవర్నర్‌ను కోరారు. పిల్లలు, గిరిజనులు, వృద్దుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ప్లాస్మా థెరపీని పెంచాలని, కరోనా చికిత్స కోసం ప్రైవేటు – ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, కేంద్ర ఆరోగ్య మాజీ కార్యదర్శి కె. సుజాతా రావు, ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే.దొర, ఐఎంఏ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, యూఎస్ఏ నుంచి కోవిడ్ నిపుణుడు స్వామినాథన్, ప్లాస్మా థెరపీతో చికిత్స పొందిన మొదటి వ్యక్తి వంశీ మోహన్, అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.


Next Story