Abhishek Sharma : నాలుగు రోజులపాటు జ్వరం.. ఫీవర్‌ను కూడా లెక్కచేయని అభిషేక్

by Harish |
Abhishek Sharma : నాలుగు రోజులపాటు జ్వరం.. ఫీవర్‌ను కూడా లెక్కచేయని అభిషేక్
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం అంతా ఇంతా కాదు. 55 బంతుల్లో 141 రన్స్ చేసి ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోరు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌కు ఐదు రోజుల గ్యాప్ ఉంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడటంతో హైదరాబాద్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే పంజాబ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్‌ది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు గట్టిగానే సాధన చేశారు. అయితే, అభిషేక్ మాత్రం అస్వస్థతకు గురయ్యాడు. నాలుగురోజులపాటు జ్వరంతో బాధపడ్డాడు. మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు వరకు తీవ్ర జ్వరంతోనే ఉన్నాడు. ఫీవర్‌ను కూడా లెక్కచేయకుండా బరిలోకి దిగి పంజాబ్‌పై విధ్వంసకర ఆట ఆడాడు. ‘నేను నాలుగు రోజులు అనారోగ్యానికి గురయ్యా. జ్వరంతో బాధపడ్డా. యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ నా చుట్టూ ఉండటం నా అదృష్టం. వారు నిరంతరం నాకు కాల్ చేశారు. నా పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్లు నన్ను నమ్మారు. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.’అని అభిషేక్ వెల్లడించాడు.

రాసుకొని వచ్చి మరి దంచేశాడు

పంజాబ్‌ కంటే ముందు అభిషేక్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 24, 6, 1, 2, 18 రన్స్ చేశాడు. పంజాబ్‌పై ఎలాగైనా రాణించాలని భావించాడు. అలాగనీ, నిదానంగా ఆడుతూ క్రీజులో నిలువడానికి చూడలేదు. ఆరంభం నుంచి మోత మోగించాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లు ఆడాడు. కొన్ని షాట్లు అయితే గతంలో తానెప్పుడు కొట్టలేదని స్వయంగా అభిషేకే చెప్పాడు.సెంచరీ తర్వాత అభిషేక్ ప్యాంట్‌లో నుంచి ఓ పేపర్‌ తీసి చూపెట్టాడు. అందులో ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అని రాసి ఉంది. అంటే పంజాబ్‌పై ఈ విధ్వంసం సృష్టించాలనే కృతనిశ్చయంతోనే అభిషేక్ బరిలోకి దిగాడని అర్థమవుతుంది. పేపర్ నోట్‌పై అభిషేక్ మాట్లాడుతూ..‘ప్రతి రోజు లేచిన తర్వాత ఏదోటి రాస్తాను. ఈ రోజు నేను ఏదైనా చేస్తే అది ఆరెంజ్ ఆర్మీ కోసమే అన్న ఆలోచన వచ్చింది. అందుకే అలా రాశా. అదృష్టం కొద్ది ఇది నా రోజు.’అని తెలిపాడు.


Next Story

Most Viewed