ఐపీఎల్-2022 వేలంలో చాహల్‌ను అందుకే కొనుగోలు చేయలేదట

by Dishanational3 |
ఐపీఎల్-2022 వేలంలో చాహల్‌ను అందుకే కొనుగోలు చేయలేదట
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో 2014 నుంచి 2021 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ను ఆ ఫ్రాంచైజీ 2022లో రిటైన్ చేసుకోలేదు. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే అంటిపెట్టుకున్న ఫ్రాంచైజీ.. చాహల్‌ను వేలంలోకి వదిలేసింది. వేలంలోనూ అతన్ని కొనుగోలు చేయకపోవడం అప్పట్లో చర్చనీయాంశమమైంది. రెండేళ్ల తర్వాత చాహల్‌ను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని ఆర్సీబీ మాజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ మైక్ హెస్సన్ రివీల్ చేశాడు.

తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పతో కలిసి జియో సినిమాతో మాట్లాడుతూ.. వేలంలో అతను ఆలస్యంగా రావడంతోనే కొనుగోలు చేయలేకపోయామని తెలిపాడు. ‘ముగ్గురిని రిటైన్ చేసుకుంటే వేలంలో అదనంగా రూ. 4 కోట్లు ఇస్తారు. ఆ మొత్తాన్ని ఉపయోగించుకుని చాహల్, హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేయాలనుకున్నాం. అయితే, వేలంలో చాహల్ నం.65. దీంతో మేము ఆందోళనకు గురయ్యాం. చాహల్ తర్వాత మేము ఆసక్తిగా ఉన్న మరో స్పిన్నర్ లేడు. అందుకే, ముందుగా హసరంగను తీసుకున్నాం. అతన్ని తీసుకోవడంలో చాహల్‌ను కొనుగోలు చేయలేకపోయాం.’ అని వివరించాడు. కాగా, వేలంలో హసరంగ‌ను ఆర్సీబీ రూ. 10 కోట్లుకు కొనుగోలు చేయగా.. చాహల్‌ను రాజస్థాన్ రూ. 6.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ తరపున చాహల్ అదరగొడుతున్నాడు. 13 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ల జాబితాలో ఉన్నాడు.



Next Story

Most Viewed