రోహిత్, కోహ్లీ త్వరగా అవుటైతే మా ప్లాన్ అదే : సూర్యకుమార్

by Harish |
రోహిత్, కోహ్లీ త్వరగా అవుటైతే మా ప్లాన్ అదే : సూర్యకుమార్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూయార్క్ పిచ్‌తో పోలిస్తే బ్రిడ్జ్‌టౌన్ పిచ్ బెటర్‌గా ఉందని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రౌండ్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్‌కు ముందు బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడాడు. ‘న్యూయార్క్‌లో తొలిసారి ఆడాం. పరిస్థితులు సవాల్‌గా ఉన్నా అక్కడ ఆడటం సంతోషంగా ఉంది. కరేబియన్ వేదికల్లో మేము చాలా ఆట ఆడాం. పరిస్థితులు మాకు తెలుసు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఆడతారో తెలుసు.’ అని తెలిపాడు.

అలాగే, అఫ్గాన్‌తో టీమ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ.. తమ బలాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు చెప్పాడు. ‘ప్రత్యర్థి గురించి ఆలోచిస్తాం. కానీ, అదే సమయంలో మా బలాలేంటో తెలుసుకుంటాం. మా సామర్థ్యాలపై నమ్మకముంది.’ అని తెలిపాడు. అలాగే, రోహిత్, కోహ్లీ త్వరగా వికెట్ పారేసుకుంటే టీమ్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సూర్య బదులిస్తూ.. ఎలాంటి మార్పు ఉండదని, ఆధిపత్యం చెలాయించడానికి బ్యాటర్లు మార్గాలు వెతుకుతారని చెప్పాడు. ‘అలాంటి పరిస్థితి ఎదురైతే క్రీజులో ఉన్న వారే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోగలరు. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ చెప్పారు. ఆ సమయంలో జట్టుకు ఏం కావాలో ఆలోచించి అదే చేస్తాం.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story