హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్​

by Sridhar Babu |
హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్​
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా ఓ యువకుడిని చంపేందుకు తల్వార్లతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన వివరాలను బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్​హెచ్ఓ ఎన్. దేవయ్య శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. రాంనగర్ కు చెందిన వేల్పుల శ్రవణ్ పై ఈనెల 16వ తేదీ రాత్రి హనుమాన్ బస్తీలో రాసబత్తుల గణేష్, రాంటెంకి శ్రీనివాస్ (గుగ్గుసు శ్రీను) కలిసి దాడి చేశారు. ఈ దాడిలో వేల్పుల శ్రవణ్ చెంపకు తీవ్ర గాయమైంది. పాత కక్షలతో రౌడీషీటర్ గణేష్ తన స్నేహితుడైన శ్రీనివాస్ తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు.

తమ కాలనీకి రావద్దని గతంలో వేల్పుల శ్రవణ్ ను గణేష్ హెచ్చరించాడు. మళ్లీ తమ కాలనీకి వస్తే చంపేస్తానని బెదిరించాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హనుమాన్ బస్తీలో శ్రవణ్ తారసపడడంతో గణేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్ కలిసి హత్యాయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​ఓ దేవయ్య మాట్లాడుతూ రౌడీ షీటర్ గణేష్, అతని స్నేహితుడు రావటెంకి శ్రీనివాస్ చట్టవ్యతిరేక చర్యలను మానుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈమేరకు నిందితులిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదుచేపి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.

Next Story

Most Viewed