e Flying Boat: చెన్నై-కోల్‌కతా కేవలం 3 గంటలే ప్రయాణం.. ఎలాగంటే?

by D.Reddy |
e Flying Boat: చెన్నై-కోల్‌కతా కేవలం 3 గంటలే ప్రయాణం.. ఎలాగంటే?
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై నుంచి కోల్‌కతా మధ్య దూరం దాదాపు 1700 కిలో మీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం.. బస్సు, ట్రైన్‌లలో వెళ్లితే 24 గంటలకు పైనే పడుతుంది. సమయాన్ని తగ్గించుకునేందుకు విమానంలో వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే, ఇప్పుడు కేవలం రూ.600తో మూడు గంటల్లోనే చెన్నై నుంచి కోల్‌కతా చేరుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి.

చెన్నైకు చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్.. మద్రాస్ ఐఐటీ సహకారంతో ఇ-ఫ్లైయింగ్‌ బోట్‌ను ఆవిష్కరించారు. విమానయానం, జలమార్గాలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించగా.. విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇ-ఫ్లయింగ్ బోట్ 'విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్' అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు 4 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.

ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. అలాగే ఈ ఎలక్ట్రానిక్‌ ఫ్లయింగ్ బోట్‌ను జీరో-కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 2029 నాటికి చెన్నై-సింగపూర్ మధ్య ఇ ఫ్లయింగ్ బోట్స్ అందుబాటులో వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తోన్నట్లు పేర్కొంది.

ఇక వాటర్ ఫ్లై టెక్నాలజీస్ 2026 నాటికి నాలుగు టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్‌ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. అలాగే ఇంటర్నేషనల్ మేరిటైమ్ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్ సర్టిఫికెట్ కోసం పనిచేస్తుంది. ఇక ఈ ఫ్లయింగ్ బోట్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే చెన్నై నుంచి కోల్‌కత్తాకు కేవలం 3 గంటల్లో రూ.600 కే చేరుకోవచ్చు.



Next Story

Most Viewed