5జీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు : టెలికాం సంఘం

by Shamantha N |   ( Updated:2021-06-06 06:44:33.0  )
5జీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు : టెలికాం సంఘం
X

దిశ, వెబ్‌డెస్క్: అధునాతన సాంకేతికత 5జీ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, ఇటీవల ప్రచారంలో ఉన్నవన్నీ అనవసర ఆందోళనలే అని టెలికాం సంఘం అభిప్రాయపడింది. ఇటీవల భారత్‌లో 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం టెలికాం విభాగం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 5జీ టెక్నాలజీ వల్ల అనర్థాలు జరుగుతాయనే విమర్శలు వినిపించాయి. అయితే, దీనివల్ల ఎలాంటి హానీ ఉండదని, రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీయే భవిష్యత్తు ‘గేమ్ ఛేంజర్’గా ఉండనుందని, ఈ పరిణామాలతో దేశ ఆర్థికవ్యవస్థతో పాటు సమాజానికి మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) వెల్లడించింది.

గత నెలలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్‌లు 5జీ తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీన్ని భారత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురానున్నారు. 5జీ అంతర్జాతీయంగా ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ ప్రమాణాలతో ఉండగా, దేశీయంగా ఇందులో పదో వంతు మాత్రమే ఉండేలా కేంద్రం నిబంధనలు అమలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 5జీ వల్ల ప్రమాదాలు ఉంటాయనడం సబబు కాదని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన ప్రతిసారీ ఇటువంటి ఆందోళనలు సహజమని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్ పి కొచర్ వివరించారు.



Next Story

Most Viewed