మరీ.. ఇంత నిర్లక్ష్యమా?

by  |
మరీ.. ఇంత నిర్లక్ష్యమా?
X

దిశ ఏపీ బ్యూరో: భారతదేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో ఇంకా వేగంగా విస్తరిస్తోంది. దానికి నిదర్శనం ఏపీలో రోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసులే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కలెక్టర్ పోలా భాస్కర్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి సుమారు 27,000 శాంపిల్స్ సేకరించారు. ఇలా సేకరించిన నమూనాలకు ఐడీ నెంబర్లు వేసి, సీల్ చేసి దానిని నోట్ చేసుకుంటారు. పరీక్షల అనంతరం ఫలితాలను ఆ వివరాల ఆధారంగా బాధితులకు వెల్లడిస్తారు. అయితే ప్రకాశం జిల్లాలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సీల్ వేయడంలో చేసిన పొరపాట్ల కారణంగా 27,000 నమూనాలు వృధాగా మారాయి. కనీసం మూత కూడా పెట్టకుండా నమూనాలను పరీక్షలకు పంపుతున్నారని దీంతో ఈ నమూనాలన్నీ టెస్టింగ్ కేంద్రాల్లో మూలపడేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతున్నారు. దీంతో ఒంగోలు, పొదిలి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన దీనికి కారణమైన వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. కరోనా పరీక్షల విషయంలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. సేకరించిన ప్రతి నమూనానూ నిర్ణీత వ్యవధిలోనే ల్యాబ్ లకు చేర్చాలని, ఒక్కో టెస్ట్ కు ప్రభుత్వం 1,100 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన వెల్లడించారు.



Next Story