'శ్రీలంక క్రికెట్‌ను సర్వనాశనం చేశాడు'.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-11-14 12:40:50.0  )
శ్రీలంక క్రికెట్‌ను సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే శ్రీలంక ఇంటిబాట పటిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. తమ క్రికెట్‌ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్‌కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు.

తన తండి (అమిత్‌ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్‌ను శాశిస్తున్నాడని ఫైరయ్యారు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్‌కు ఈ దుస్థితి వచ్చిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం​2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. మరోవైపు భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.


Next Story