రికవరీల్లో ప్రపంచంలోనే టాప్ !

by  |
రికవరీల్లో ప్రపంచంలోనే టాప్ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య దాదాపు ఏడు కోట్లకు చేరువగా ఉంది. తాజాగా 24గంటల వ్యవధిలో సుమారు 15లక్షల టెస్టులు చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. తొలిరోజుల్లో కేవలం ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే నిర్వహించగా ఆ తర్వాత రాపిడ్ యాంటీజెన్ టెస్టులు కూడా చేపట్టడంతో అన్నీ కలిపి ఇప్పుడు సుమారు ఏడు కోట్ల స్థాయికి చేరుకున్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే మూడు విధానాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఇక కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించిన భారత్ రికవరీల్లో మాత్రమే టాప్‌ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య ఇప్పటివరకూ బ్రెజిల్‌లోనే అధికంగా (41 లక్షలు) ఉండగా, ఇప్పుడు ఆ దేశాన్ని అధిగమించి భారత్ తొలి స్థానానికి చేరుకుంది. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 58.18 లక్షల కేసులు నమోదుకాగా అందులో 47.56 లక్షల కేసులు రికవరీ అయినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇంకా 9.70 లక్షల యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుండగా కరోనా మరణాల రేటు తగ్గుతూ ఉంది. రికవరీ రేటు సెప్టెంబరు 24నాటికి సుమారు 82% ఉండగా మరణాల రేటు మాత్రం 1.58%గా ఉంది.

గడచిన 24గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద 1,141 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 92,290కు చేరుకుంది. కరోనా మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


Next Story