రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లే మూసీలో ప‌డేస్తారు.. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-25 07:58:37  IST  )

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గల్లీ స్థాయి నాయకుడు అని మల్లొకసారి నిరూపించుకున్నాడని విమర్శించారు.

రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లే మూసీలో ప‌డేస్తారు.. మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గల్లీ స్థాయి నాయకుడు అని మల్లొకసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ కాలి గోటికి సరోపోడు అని మేము కూడా అనొచ్చు.. కానీ అనడం లేదన్నారు. మీకు అది ఒక్క భాషనే వచ్చు కావొచ్చు మాకు అన్ని భాషలు వచ్చన్నారు. ఇతరుల చావు కోరుకోవడం అనేది రం** గాళ్లు చేసే పని అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నీది కేసీఆర్ స్థాయి కాదని గుర్తు పెట్టుకో అంటూ మండిప‌డ్డారు.

ఒక్కటి మాత్రం వాస్తవం అని, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలే బండ రాళ్లు కట్టి మూసీలో వేస్తారని అన్నారు. రెండేళ్లలో కేసీఆర్ గురించి ఒక్క మాట అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. మరి నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావని అన్నారు. నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచులే నిన్ను తిడుతున్నారని.. ఎవరైనా సావు కోరుకుంటారా అని అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరవాత తప్పకుండా తోలు వలుస్తామని హెచ్చరించారు. నీ తోలు వొలువడానికి నీ శరీరం ముట్టుకునే పరిస్థితిలో లేదని అంత గలీజ్ అంటూ తీవ్రపదజాలంతో మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళితే నువ్వు ఎందుకు వణుకుతున్నావు అంటూ ప్రశ్నించారు.

పోలీసులు, అధికారులు, మీ గూండాలు, మీ పార్టీ నాయకులు అందరూ కలిసి సర్పంచ్ ఎన్నికల్లో పనిచేశారని ఆరోపించారు. అయినా ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారన్నారు. బీఆర్ఎస్ సైనికులు విరోచితంగా పోరాడి బ్రహ్మాండమైన ఫలితాలు సాధించార‌ని చెప్పారు. మంచి పనులు చేసి.. మంచి మాటలతో ప్రజా హృదయాలను గెలవాలన్నారు. కానీ నీ మాటలు విని మీ సర్పంచులే సిగ్గుపడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభలు పెడితే మీ దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నారని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు తప్ప స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదన్నారు. కృష్ణా గోదారి జలాలు దోపిడీకి గురైతున్నాయని చెప్పినా ప్ర‌భుత్వం పట్టించుకోలేదని విమ‌ర్శించారు. నదులపై హక్కులను కేంద్రం గుంజుకుంటుందంటే వినలేదన్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు మోడీ ద్రోహం చేస్తున్నారన్నార‌ని చెప్పినా చెవిన పెట్టలేదన్నారు. మీ పదవుల కొరకు మా గొంతులో ఎండబెడతామంటే ఊరుకుంటామా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మేము మౌనంగా కూర్చోలేము కదా అని అన్నారు. ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసిఆర్ పైన ఉందని, తెలంగాణ తెచ్చిన వాళ్ళంగా.. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అన్నారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పిన త‌మ పైనే ఎదురుదాడికి దిగుతున్నార‌ని ఆరోపించారు. ఇలానే ఉంటే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలకు తీవ్ర నీటి సమస్యలు తలేత్తుతాయని అన్నారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కూడా సరైన అవగాహన లేదన్నారు. ఒకవేళ పొరపాటు జరిగితే తప్పు ఒప్పుకొని చంపలేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ మంత్రి 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్లు ఉత్తరం అవగాహన లేకుండానే.. మీకు తెలియకుండానే రాశాడా అని ప్ర‌శ్నించారు. ఈ విషయంలో కేసీఆరే కాదు ప్రజలు కూడా ప్రభుత్వం తోలు వొలుస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొంద పెడతారని, ఈ ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకపోతే ప్రజా ఉద్యమం తప్పక మొదలు పెడతామని చెప్పారు.

Read More..

రైతులకు బేడీలు వేయడం పాపమే.. అందులో మేమందరం భాగమే: ఎమ్మెల్సీ కవిత

Next Story